Anjali: 18 మందిని పెళ్లాడిన అంజలిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు

  • నిందితురాలిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
  • అంజలితోపాటు మరో ఐదుగురి అరెస్ట్
  • వలపన్ని పట్టుకున్న పోలీసులు
Young girl who married 18 men arrested

యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై నగదు, నగలతో పరారు కావడం.. భాగ్‌వతి అలియాస్ అంజలికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటి వరకు ఏకంగా 18 మందిని పెళ్లాడి మోసం చేసింది. చివరికి రాజస్థాన్‌ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెట్టుకుంటోంది.

తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న అంజలి మరో ఐదుగురితో కలిసి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది. జునాగఢ్‌ పరిధిలో ఉండే అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడిన అంజలి నగలు, మూడు లక్షల రూపాయల నగదుతో పరారైంది. తాను మోసపోయినట్టు తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజలి బాగోతం బయటకు వచ్చింది.

మారు పేరు, నకిలీ ధ్రువ పత్రాలతో ఆమె గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అంజలితోపాటు మరో ఐదుగురిని కటకటాల వెనక్కి పంపారు. విచారణలో ఆమె 18 మంది యువకులను పెళ్లాడినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News