kodali nani: చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: కొడాలి నాని

  • చంద్రబాబు అండ్ కో భూకుంభకోణాలు చేశారు
  • ఆయనకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేమిటి?
  • బాబుపై చర్యలు తీసుకుంటేనే దళితులకు న్యాయం జరుగుతుంది
Kodali Nani comments on Chandrababu

దళితులను మోసం చేసేలా అమరావతిలో చంద్రబాబు అండ్ కో భూకుంభకోణాలు చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏకపక్ష జీవోలతో దళిత వర్గాలను మోసం చేశారని విమర్శించారు. అసైన్డ్ భూముల హక్కుదారులైన దళితులను బెదిరించి, అసత్య ప్రచారాలు చేసి, నామమాత్రపు ధరలను చెల్లించి మోసం చేశారని అన్నారు. అచ్చెన్నాయుడు ఆంబోతులా అరుస్తున్నా, బుద్ధా వెంకన్న కుక్కలా మొరుగుతున్నా తాము బెదిరేది లేదని చెప్పారు. చంద్రబాబు అండ్ కోపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని అన్నారు.

అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురిపై ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారని... అలాంటప్పుడు భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను అనుసరిస్తూ ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను తాము పట్టించుకోబోమని... తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకుంటేనే దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

More Telugu News