Ariz Khan: బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ దోషి అరిజ్ ఖాన్ కు మరణశిక్ష

  • 2008లో ఢిల్లీలో బాంబు పేలుళ్లు
  • బాట్లా హౌస్ లో దాగిన ఉగ్రవాదులు
  • ఢిల్లీ పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు
  • మోహన్ చంద్ శర్మ అనే ఇన్ స్పెక్టర్ మృతి
  • 2018లో ఆరిజ్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
Batla House encounter convicted Ariz Khan gets death sentence

దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో దోషి అరిజ్ ఖాన్ కు ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించింది. 2008లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మోహన్ చంద్ శర్మ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ మరణానికి కారకుడయ్యాడంటూ అరిజ్ ఖాన్ ను కోర్టు ఇటీవలే దోషిగా నిర్ధారించింది. అరిజ్ ఖాన్ ఇండియన్ ముజాహిదిన్ సంస్థకు చెందిన టెర్రరిస్టు.

2008లో ఢిల్లీలో వరుస పేలుళ్లు సంభవించగా, ఈ పేలుళ్లకు కారకులుగా భావించిన ఉగ్రవాదులు బాట్లా హౌస్ లో దాక్కున్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదిన్ కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు కూడా హతమయ్యారు.

అయితే, అరిజ్ ఖాన్, జునైద్ అనే ఉగ్రవాదులు అక్కడ్నించి పరారయ్యారు. ఆ తర్వాత అరిజ్ ఖాన్ ను 2018లో నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఇటీవలే అతడిని దోషిగా తేల్చిన కోర్టు, నేడు జరిగిన విచారణలో ఉరిశిక్ష విధించింది.

More Telugu News