Team India: ఇంగ్లండ్ పై రెండో టీ20లో గెలిచి లెక్క సరిచేసిన టీమిండియా

  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
  • 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్
  • 165 పరుగుల టార్గెట్ ను 17.5 ఓవర్లలోనే ఛేదించిన వైనం
  • 73 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ
  • రాణించిన ఇషాన్ కిషన్, రిషబ్ పంత్
Team India wins second match against England and level the series

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ విసిరిన 165 పరుగుల విజయలక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కోహ్లీ (73 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడడం ఈ మ్యాచ్ లో హైలైట్.

అంతకుముందు టీమిండియా టాస్ గెలిచి ఇంగ్లండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. జాసన్ రాయ్ (46), కెప్టెన్ మోర్గాన్ (28) రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ సుందర్, పేసర్ శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ పడినా... తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న ఇషాన్ కిషన్ ధాటిగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ సైతం దూకుడుగా ఆడి 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేశాడు.

ఇక టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సమయోచిత అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోనే మార్చి 16న జరగనుంది.

More Telugu News