Nalgonda District: అచ్చం ‘భద్రమ్’ సినిమాలోలానే.. ఇన్సూరెన్స్ రాకెట్‌కు అదే ప్రేరణ!

  • నల్గొండ జిల్లా  ఇన్సూరెన్స్ రాకెట్‌ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
  • సినిమాలో ఉన్నది ఉన్నట్టు అమలు చేసిన నిందితుడు
  • అతడు చెప్పింది విని విస్తుపోయిన పోలీసులు
  • కోటిరెడ్డి  హత్యతో దొరికిపోయిన వైనం
Insurance Racket Accused Raju Planned as it is in Bhadram Movie to his crimes

సినిమాల్లో చూపించే మంచి నుంచి ప్రేరణ పొందుతున్న వారు ఎందరున్నారో తెలియదు కానీ, చెడును మాత్రం ప్రేరణగా తీసుకుని చెలరేగిపోతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా, నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన ఇన్సూరెన్స్ ముఠా చేసిన కిరాతకాలు కూడా ఓ సినిమాను ప్రేరణగా తీసుకుని చేసినవేనని తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు.

పేద కుటుంబాలే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈ కేసులోని నిందితుడు ధీరావత్ రాజు ‘భద్రమ్’ సినిమాను తన ప్లాన్‌కు ఎంచుకున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిన రాజు డబ్బుల కోసం ఏకంగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాడు.  నేరాలు చేయడంలో ఆరితేరిన రాజు క్రైమ్ సీరియళ్లు, సినిమాలను చూస్తూ వాటిని బాగా ఆకళింపు చేసుకున్నాడు. వ్యాధులతో రేపో, మాపో చనిపోయే వారిని గుర్తించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పేరున బీమా చేయించేవాడు. ఆ తర్వాత అతడిని ఎవరికీ అనుమానం రాకుండా చంపేసి ప్రమాదంలో మరణించినట్టు నమ్మించి బీమా క్లెయిమ్ చేసేవాడు. వచ్చే డబ్బుల్లో మెజారిటీ వాటాను అతడు నొక్కేసి మిగతాది బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చేవాడు.  

2013లో సూర్యాపేట జిల్లాలోని శూన్యపహాడ్‌కు చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి రాజు సమీప బంధువే కావడంతో బాధిత కుటుంబాన్ని రాజు సంప్రదించాడు. సక్రియా బతికే ఉన్నట్టుగా పత్రాలు సృష్టించి రూ. 1.4 లక్షలకు బీమా చేయించాడు. ఆ తర్వాత అతడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుని బీమా క్లెయిమ్ చేశాడు. ఇది విజయవంతం కావడంతో ఆ తర్వాత చెలరేగిపోయాడు.

అయితే, తొలి పథకం సక్సెస్ అయినా ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలో తెలియని రాజు దాదాపు 10 నెలలపాటు ఖాళీగా ఉన్నాడు. ఈ సమయంలో 2014లో విడుదలైన ‘భద్రమ్’ సినిమా చూశాడు. యాక్సిడెంట్‌ పాలసీ చేయించి, అమాయకులను చంపి, రోడ్డు ప్రమాదాలుగా చిత్రించి, బీమా డబ్బులను క్లెయిమ్‌ చేసుకునే రాకెట్‌ నేపథ్యంతో సాగే కథ ఇది. ఈ సినిమాను ప్రేరణగా తీసుకున్న రాజు తన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం మొదలుపెట్టాడు. రేపో, మాపో చనిపోయేవారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను సంప్రదించేవాడు. వారిపై బీమా చేయించేవాడు. ఆపై వారిని చంపేసి, ప్రమాదంగా చిత్రీకరించి బీమా క్లెయిమ్ చేసేవాడు. వచ్చిన సొమ్మును నామినీతో కలిసి వచ్చిన సొమ్మును పంచుకునేవాడు.

కాగా, ఈ కేసు దర్యాప్తు జరుపుతుండగానే నాగార్జున సాగర్‌లో ఆరేళ్ల క్రితం జరిగిన ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. మామ పేరిట మూడు భారీ వాహనాలు కొనుగోలు చేయించిన అల్లుడు వాటికి బీమా చేయించాడు. ఆ తర్వాత మామకు కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఓ బ్యాంకులో మామకు ఖాతా తెరిపించాడు. ఈ బ్యాంకులో ఖాతాదారులకు యాక్సిడెంటల్ పాలసీ ఉంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగిన తర్వాత మామను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. అతడు చనిపోవడంతో వాహనాల నెల వాయిదాలు రద్దయ్యాయి. బ్యాంకు నుంచి బీమా సొమ్ము అందింది. ఇలా ఐదు పాలసీల నుంచి నిందితుడైన అల్లుడు లబ్ధి పొందిన విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు.  

2017లో నిందితుడు రాజు ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ, గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమై పోలీసులకు చిక్కి రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. దీంతో ముందే ఒప్పందం చేసుకున్న కోటిరెడ్డిని హత్య చేసే విషయంలో ఆలస్యమైంది. కోటి రెడ్డి పేరిట రూ. 1.20 కోట్లు వచ్చే బీమాలు తీసుకున్నాడు. చివరికి ఇటీవల అతడిని హత్య చేసి మళ్లీ దొరికిపోయాడు.

More Telugu News