COVID19: కరోనా టీకా కోసం 2.6 కోట్ల మంది రిజిస్ట్రేషన్​

  • సగానికిపైగా పురుషులే.. 41% మహిళలు
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో సరిగ్గా సాగని కార్యక్రమం
  • తీసుకున్నవారు 2.4 కోట్ల మంది
  • రోజువారీ టార్గెట్ లో 60% మందికే టీకా
Above half of the public who registered for corona vaccine are males

దేశంలో ఇప్పటిదాకా 2.6 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేయించుకున్నారని, అందులో 75 శాతం అపాయింట్ మెంట్లు కొవిన్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా ఆన్ లైన్ లో జరిగినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మిగతా రిజస్ట్రేషన్లన్నీ టీకాలు వేసే కేంద్రాల వద్దే జరిగాయని తెలిపింది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 58.5 శాతం పురుషులుండగా.. 41 శాతానికిపైగా మహిళలున్నారు. ‘ఇతర’ విభాగంలో 3,775 మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు.

ఇక, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎక్కువగా ప్రభుత్వ కేంద్రాల్లోనే జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతినిచ్చినా.. అనుకున్న దాంట్లో కేవలం 18 శాతం వరకే వ్యాక్సినేషన్ జరుగుతోందని పేర్కొంది. మొత్తంగా రోజూ 36 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కేవలం 60 శాతం మందికే వేయగలుగుతున్నట్టు ఓ అధికారి చెప్పారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంగళవారం 22,405 కేంద్రాల్లో కరోనా టీకాలను వేస్తున్నారు. అందులో కేవలం 4,681 ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే టీకాలు వేశారు. 17,724 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సాగింది. కాగా, ఇప్పటిదాకా మొత్తంగా 2.4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అందులో 82 శాతం మంది మొదటి డోసు తీసుకున్న వారే ఉన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకాలను విస్తృతంగా వేసేందుకు మంచి అవకాశం ఉందని, అయితే, రవాణానే పెద్ద సమస్యగా మారిందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కొన్ని ఆస్పత్రులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. కొవిన్ ప్లాట్ ఫాంపై సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదన్నారు.

More Telugu News