కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసులో మలుపు!
- కేసు ఉపసంహరణకు సామాజిక కార్యకర్త నిర్ణయం
- లాయర్ ద్వారా పోలీసులకు లేఖ
- బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందనే..
ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని దినేశ్ నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ఆయన సంతకం చేసి ఇచ్చిన లేఖను పోలీసులకు అందించినట్టు న్యాయవాది ఎస్కే పాటిల్ తెలిపారు. ఆయన త్వరలోనే పోలీసులను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు దినేశ్ లొంగబోరని పేర్కొన్న పాటిల్.. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడడమే ఆయన లక్ష్యమన్నారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని, అది మరింత తీవ్రంగా మారకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారాన్ని పోలీసులకు అందించేందుకు దినేశ్ సిద్ధంగా ఉన్నారని వివరించారు.
ఉద్యోగం పేరుతో మాజీ మంత్రి రమేశ్ ఓ మహిళను లైంగికంగా వాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ, టీవీ చానళ్లలోనూ ప్రసారమైంది. తన ఫొటోను వాడుకుని ఈ వీడియోను చేశారని తొలుత ఆరోపించిన రమేశ్ జార్కిహోళి ఈ నెల 3న తన పదవికి రాజీనామా చేశారు.