CBDT: తమిళనాడులో రూ.వెయ్యి కోట్లు సీజ్​.. బంగారం వ్యాపారి ఇళ్లు, ఆఫీసులపై దాడులు

  • మార్చి 4న నెల్లూరు సహా 27 చోట్ల సోదాలు
  • బోగస్ రుణాల చెల్లింపులు చేసినట్టు గుర్తించిన సీబీడీటీ
  • నోట్ల రద్దు నాటి డిపాజిట్లపై పొంతన లేని లెక్కలు
Undisclosed Income Worth Rs 1000 Crore Found In Tamil Nadu Tax Raids

తమిళనాడులోని ఓ ప్రముఖ బంగారం వ్యాపారి నుంచి లెక్క తేలని రూ.వెయ్యి కోట్లను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 4 న చెన్నై, ముంబై, కోయంబత్తూరు, మదురై, తిరుచురాపల్లి, త్రిసూర్, నెల్లూర్, జైపూర్, ఇండోర్ లోని 27 చోట్ల దాడులు చేసినట్టు సీబీడీటి ప్రకటించింది. సోదాలకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించింది. అయితే, ఆ వ్యాపారి ఎవరు అన్న వివరాలను మాత్రం చెప్పలేదు.

దాడుల సందర్భంగా లెక్క తేలని డబ్బు లావాదేవీలు, ఆ సంస్థ నుంచి బోగస్ రుణ చెల్లింపులు, అడ్వాన్స్ కొనుగోళ్ల రూపంలో రుణ చెల్లింపుల డమ్మీ ఖాతాలు, నోట్ల రద్దు సందర్భంగా ఖాతాల్లో డిపాజిట్ చేసిన లెక్క తేలని డబ్బు, వివరాల్లేని స్టాక్ లను గుర్తించినట్టు పేర్కొంది. స్థానికంగా ఉన్న వారి దగ్గరి నుంచి అప్పులు తీసుకుని బిల్డర్లకు రుణాలిచ్చారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని చెప్పింది.

ఇక, బంగారం అక్రమ కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. తనకు అప్పులున్నట్టు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, పాత బంగారాన్ని నగల తయారీకి వాడుకున్నట్టు చెప్పాడని పేర్కొంది. మొత్తంగా ఆ వ్యాపారి నుంచి రూ. వెయ్యి కోట్ల దాకా స్వాధీనం చేసుకున్నామని చెప్పింది.

More Telugu News