CPI Narayana: నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ

  • ఏకగ్రీవాలపై నారాయణ ఆశ్చర్యం
  • నిర్బంధ ఏకగ్రీవాలను ఇప్పుడే చూస్తున్నానని వెల్లడి
  • అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆగ్రహం
  • వైసీపీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వ్యాఖ్యలు
CPI Narayana campaigns in Guntur municipal elections

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అత్యధిక సంఖ్యలో ఏకగ్రీవాలు అవుతుండడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గుంటూరులో టీడీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధ ఏకగ్రీవాలను తాను ఇప్పుడే చూస్తున్నానని వెల్లడించారు. ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. వైసీపీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు.

వైసీపీకి దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల వల్ల ఓట్లు రావని భయమా? అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో ముందుకు వెళుతున్నామని, మున్ముందు కూడా ఇదే అవగాహన కొనసాగే అవకాశం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.

ఇక, విశాఖలో శారదా పీఠాన్ని సందర్శించడం, స్వరూపానందేంద్రతో భేటీ కావడంపైనా ఆయన వివరణ ఇచ్చారు. తాము నాస్తికులం కాదని, దేవుడు అనే భావనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్వరూపానందను కలవడం ఉద్దేశపూర్వకంగా  జరిగింది కాదని, ఎన్నికల ప్రచారంలో వెళుతుండగా, తమ అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులోనే శారదా పీఠం కూడా ఉండడంతో లోపలికి వెళ్లామని వివరించారు.

  • Loading...

More Telugu News