Chandrababu: ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నా: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు

  • చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • కర్నూలు కింగ్ మార్కెట్ వద్ద రోడ్ షో
  • తాము అభివృద్ధికి పెద్దపీట వేశామని వెల్లడి
  • జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశాడని విమర్శలు
  • ఎన్నికలు ఏకపక్షంగా సాగుతున్నాయని వ్యాఖ్యలు
Chandrababu at Kunrool road show

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ్టి నుంచి ఈ నెల 8 వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి తన ప్రచారం షురూ చేశారు. కర్నూలు కింగ్స్ మార్కెట్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేశామని, జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశాడని అన్నారు.

రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని, రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదని అన్నారు. రాష్ట్రానికి ఎన్టీఆర్ ఆత్మగౌరవం కల్పించారని, కానీ ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని వివరించారు.

జగన్... ఏబీసీడీ పాలన తెచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన... బీ అంటే బాదుడు, సీ అంటూ కరప్షన్, డీ అంటే డిస్ట్రక్షన్ (విధ్వంసం) అని అభివర్ణించారు. అమ్మఒడి రూ.14 వేలు చేసి... నాన్న బుడ్డి (మద్యం) రూ.36 వేలు చేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు. అప్పుడు పాదయాత్రలో ముద్దులు పెట్టాడని, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని వ్యాఖ్యానించారు.

స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతూ.... ఏపీలో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతున్నాయని అన్నారు. చిత్తూరులో ఏకగ్రీవాలు చేసి, తిరుపతిలో అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఏకగ్రీవాలు జరగలేదని తెలిపారు. నామినేషన్లు సక్రమంగా ఉన్నా తిరస్కరించారని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా చేశారని మండిపడ్డారు.

More Telugu News