Fourth Test: రేపటి నుంచి భారత్-ఇంగ్లండ్ చివరి టెస్టు... అదే పిచ్ అంటున్న రూట్!

  • నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
  • గత టెస్టు పిచ్ కు తాజా పిచ్ కు పెద్దగా తేడాలేదంటున్న రూట్
  • పిచ్ ఎలా ఉన్నా తాము పట్టించుకోబోమన్న కోహ్లీ
  • గత రెండు టెస్టుల నుంచి పాఠాలు నేర్చుకున్నామన్న రూట్
  • ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఆడడమే తమ ప్రాధాన్యత అని వెల్లడి
Tomorrow onwards India and England fourth test

భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో చివరిదైన టెస్టు రేపటి నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రెండ్రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చింది ఈ మైదానమే కావడంతో అందరి దృష్టి పిచ్ పైనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. పిచ్ ఎలా ఉన్నా తాము పట్టించుకోమని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేయగా, గత టెస్టులో ఆడిన పిచ్ కు, ఈ మ్యాచ్ కు ఏర్పాటు చేసిన పిచ్ కు పెద్దగా తేడా కనిపించడంలేదని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అంటున్నాడు.

అయితే గత రెండు టెస్టుల నుంచి తాము చాలా పాఠాలు నేర్చుకున్నామని, తప్పకుండా పుంజుకుంటామని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక మంచి పిచ్ అంటే ఎలా ఉండాలన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని, తాము మాత్రం ప్రత్యర్థికంటే మెరుగ్గా ఆడడానికి ప్రాధాన్యత ఇస్తామని రూట్ స్పష్టం చేశాడు. పిచ్ గురించి మాట్లాడడానికి ఏముంటుందని పేర్కొన్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో నెగ్గింది. అదే మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ అద్భుతంగా ఆడి 317 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. ఆ తర్వాత మొతేరాలో జరిగిన మూడో టెస్టులో భారత్ 10 వికెట్లతో గెలిచి సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

More Telugu News