తమిళనాడు ఎన్నికల బరిలోకి ఎంఐఎం.. డీఎంకేతో పొత్తుకు సై!
- 22 స్థానాల్లో పోటీ చేస్తామన్న ఎంఐఎం తమిళనాడు చీఫ్
- డీఎంకేతో పొత్తు కుదరకుంటే ఒంటరిగా బరిలోకి
- ఇప్పటికే 11 స్థానాలు గుర్తించామన్న వకీల్ అహ్మద్
డీఎంకేతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ తమిళనాడు చీఫ్ వకీల్ అహ్మద్ తెలిపారు. పొత్తుకు ఆ పార్టీ విముఖత చూపితే ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తమకు బలమున్న 22 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, అందులో భాగంగా ఇప్పటికే 11 స్థానాలను గుర్తించామని వకీల్ అహ్మద్ తెలిపారు.
ఇటీవల బీహార్లో పోటీ చేసిన ఎంఐఎం.. పశ్చిమ బెంగాల్లోనూ సత్తా చాటాలని నిర్ణయించింది. తృణమూల్తో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నా మమత అందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని అసద్ నిర్ణయించినట్టు సమాచారం. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే విడతలో జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.