Serum: ఇండియా నుంచి యూకేకు కోటి కరోనా టీకా డోస్ లు!

  • ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సీరమ్
  • యూకే నుంచి 10 కోట్ల డోస్ లకు ఆర్డర్
  • తొలి విడతలో కోటి టీకాలు
  • పేద దేశాలకు పంపిణీ ఆగబోదన్న సీరమ్
Serum to Supply 10 Crore Doses of Vaccine to UK

ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ లను తయారు చేస్తున్న భారత సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి బ్రిటన్ కోటి డోస్ ల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించిన యూకే ప్రభుత్వం, త్వరలోనే ఇవి డెలివరీ కానున్నాయని పేర్కొంది. యూకే తరఫున మొత్తం 10 కోట్ల డోస్ లను సీరమ్ కు ఆర్డర్ ఇచ్చామని, తొలి విడతలో కోటి టీకా డోస్ లు రానున్నాయని అధికారులు ప్రకటించారు.

కాగా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేస్తున్న సీరమ్, ఇప్పటికే పలు పేద, మధ్యాదాయ దేశాలకు సరఫరా చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ రెగ్యులేటరీ ఏజన్సీ (ఎంహెచ్ఆర్ఏ) ప్రతినిధులు సీరమ్ ఇనిస్టిట్యూట్ లో తయారీ విధానాన్ని ఆడిట్ చేస్తున్నారని, అక్కడి నుంచి టీకా వయల్స్ ను క్షేమంగా బ్రిటన్ చేర్చే ప్రక్రియనూ పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో ధనిక దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్ ను అందించకుండా చేస్తున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. బ్రిటన్ వంటి దేశాలు తొలుత వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించినా, ఇప్పుడు పెద్దఎత్తున టీకాల సరఫరా కోసం ఇండియా వైపు చూస్తుండటంతో, ఆఫ్రికన్ దేశాలకు ఇబ్బందులు తప్పవని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది కూడా. అయితే, బ్రిటన్ కు 10 కోట్ల డోస్ లను సరఫరా చేయాలని డీల్ కుదుర్చుకున్నంత మాత్రాన వ్యాక్సిన్ కోసం పేద దేశాలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని సీరమ్ హామీ ఇచ్చింది.

More Telugu News