Telangana: డీడీతో పనిలేదు... చెక్కిచ్చినా లిక్కర్ సరఫరా: తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆఫర్!

  • ఇప్పటివరకూ డీడీ ఇస్తేనే మద్యం సరఫరా
  • నిబంధనలను సవరించిన అబ్కారీ శాఖ
  • చెక్ బౌన్స్ అయితే, 20 శాతం జరిమానా
Telangana Abkari Offer to Liquor Dealers

తెలంగాణ ప్రభుత్వ ఖజానాను నింపడంలో ముందున్న ఎక్సైజ్ శాఖ, తనకు అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తాజాగా, వైన్స్ షాపు యజమానులు, బార్ల యజమానులకు అబ్కారీ శాఖ బంపరాఫర్ ఇచ్చింది. ఇప్పటివరకూ తమకు అవసరమైన మద్యం సరకుపై డీడీని సమర్పిస్తేనే, డెలివరీ ఇస్తున్న ఎక్సైజ్ శాఖ, ఇకపై చెక్కులను కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే, చెక్ బౌన్స్ అయితే మాత్రం దాని విలువలో 20 శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

వారంలో రెండు రోజులు... అంటే శని, ఆదివారాలు సెలవులు అమలవుతున్న నేపథ్యంలో, ఆ రెండు రోజులూ వ్యాపారానికి బ్రేక్ పడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చెక్కు ఇచ్చినా దాన్ని తీసుకుని డిపోల నుంచి రిటెయిలర్లకు మద్యం సరఫరా చేస్తామని వెల్లడించింది. కాగా, ఇటీవలే మునిసిపాలిటీల పరిధిలో బార్ల లైసెన్స్ లను ప్రకటించిన ఎక్సైజ్ శాఖ, ఔత్సాహిక వ్యాపారుల నుంచి దరఖాస్తు ఫీజు రూపంలోనే రూ. 75 కోట్లు ఆదాయం పొందిన సంగతి తెలిసిందే.

More Telugu News