Team India: బెంబేలెత్తించిన అక్సర్ పటేల్.. కుప్పకూలిన ఇంగ్లండ్

  • 112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
  • 6 వికెట్లను పడగొట్టిన అక్సర్ పటేల్
  • 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన క్రాలీ
England collapses for 112 runs against India in 3rd test

అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న డేనైట్ టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగారు. బంతిని గింగిరాలు తిప్పుతూ ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు. అక్సర్ పటేల్, అశ్విన్ ల ధాటికి ఇంగ్లండ్ 48.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మధ్యాహ్నం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను ఆదిలోనే పేసర్ ఇశాంత్ శర్మ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 2 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ సిబ్లీని (డకౌట్) ఇశాంత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మన స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరారు.

ఇంగ్లండ్ జట్టులో క్రాలీ మాత్రమే 53 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో బెయిర్ స్టో (0), జో రూట్ (17), స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) పరుగులు చేశారు. అండర్సన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. కాసేపట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

More Telugu News