Peddireddi Ramachandra Reddy: కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • నిన్న ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు
  • కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారుల హవా
  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి
  • కుప్పంలో తమ అభివృద్ధి కార్యక్రమాలే గెలిపించాయని వ్యాఖ్య 
Peddireddy says victories in third phase elections only by CM Jagan

ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా వైసీపీకే విజయాలు లభించడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాలన్నీ సీఎం జగన్ వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ బలపర్చిన వాళ్లే గెలిచారని, అందుకు కారణం కుప్పంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని స్పష్టం చేశారు.

మూడో విడత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,574 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే, టీడీపీ కేవలం 13 శాతం విజయాలకే పరిమితమైందని అన్నారు. కానీ చంద్రబాబు 36 శాతం గెలిచినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ పక్షానే నిలిచారని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

కుప్పంలో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 79 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులే నెగ్గారని వెల్లడించారు. ఏకగ్రీవాల్లోనూ తమదే హవా అని, టీడీపీకి 15.8 పంచాయతీలు ఏకగ్రీవం అయితే, తమకు 85.81 శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు.

More Telugu News