Puducherry: కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు.. పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం

  • మంత్రి సహా ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
  • బీజేపీలో చేరిన మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే తీప్పైనాథన్
  • రాహుల్ పర్యటనకు ముందు అధికార కాంగ్రెస్‌లో కలవరం
Congress Govt Losses Mejarity in Puducherry Assembly

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పర్యటించనున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 18 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తోంది. ముఖ్యమంత్రి నారాయణస్వామి కేబినెట్ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే తీప్పైనాథన్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మొన్న రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే జాన్ కుమార్ నిన్న రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను స్పీకర్ శివకొళుందు ఆమోదించారు. దీంతో నారాయణస్వామి  ప్రభుత్వం మైనారిటీలో పడింది. అయితే సీఎం నారాయణస్వామి మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, పూర్తి మెజారిటీ ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల మేరకు ముందుకెళ్లనున్నట్టు చెప్పారు.

కాగా, పుదుచ్చేరిలో అధికార పక్షంలో స్పీకర్‌తోపాటు కాంగ్రెస్‌కు 10, డీఎంకేకు 3, స్వతంత్రులు ఒకరు ఉండగా, ప్రతిపక్షంలో ఎన్నార్ కాంగ్రెస్‌కు ఏడుగురు, అన్నాడీఎంకేకు 4, బీజేపీకి ముగ్గురు (నామినేటెడ్) సభ్యులు ఉన్నారు.

More Telugu News