Japan: జపాన్ లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం!

  • రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత
  • నైమీ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రం
  • సునామీ ప్రమాదం లేదన్న అధికారులు
Above 7 Earthquake in Japan

భూకంపాలు అధికంగా సంభవించే జపాన్ మరోసారి వణికిపోయింది. ఫుకుషిమా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం సంభవించింది. నైమీ పట్టణానికి తూర్పువైపున 90 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. జపాన్ కాలమానం ప్రకారం, రాత్రి 11.08 గంటలకు ఇది సంభవించింది.

ఈ విషయాన్ని వెల్లడించిన 'జపాన్ టైమ్స్' బ్రేకింగ్ న్యూస్, ఇప్పటివరకూ ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఈ భూకంపం తరువాత, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేయలేదని పేర్కొంది. ఇదే సమయంలో తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

భూ ప్రకంపనలు టోక్యో వరకూ కనిపించాయని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించగానే, ప్రజలు ఆందోళనతో వీధుల్లోకి వచ్చారని, స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఈ భూకంపానికి సంబంధించిన చిత్రాలను, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు.

మాల్స్ లోని ర్యాక్స్ లో పెట్టిన వస్తువలన్నీ కింద పడిన చిత్రాలను, భవనాలు ఊగుతుండటం, ప్రజలు టేబుల్స్, తదితరాల కిందకువెళ్లి, ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండటం వంటి వీడియోలు ఉన్నాయి.

More Telugu News