Eatala Rajendar: సెంటిమెంట్లు ఎక్కువకాలం పనిచేయవు... షర్మిల పార్టీపై ఈటల వ్యాఖ్యలు

  • తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ అంటూ ప్రచారం
  • వైఎస్ అభిమానులను ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు షర్మిల యత్నం
  • మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయన్న ఈటల
  • కొత్తవాళ్లకు ఈ ప్రాంతంతో ఏం సంబంధమని వ్యాఖ్యలు
Eatala Rajendar comments on YS Sharmila political party

వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కాకుండా తెలంగాణలో ఆమె పార్టీ స్థాపించనుండడం ఆశ్చర్యం కలిగిస్తుంటే, సీఎం జగన్ తో విభేదాలే పార్టీ ఏర్పాటుకు కారణమని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ప్రముఖుడు కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

కాగా, షర్మిల పార్టీని టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్వాగతించడంలేదు. వైఎస్సార్ అభిమానులను ఏకం చేయాలని షర్మిల ప్రయత్నిస్తుండడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. సెంటిమెంట్లు ఎక్కువకాలం పనిచేయవని అభిప్రాయపడ్డారు. అయినా కొత్తగా వచ్చేవాళ్లకు ఈ ప్రాంతంలో ఏం పని? అని ప్రశ్నించారు.

మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని, కానీ ఇక్కడ మనిషి గురించి ఆలోచించేవాళ్లకే ప్రజల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాల వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల పేర్కొన్నారు. మతాల మధ్య విద్వేషాలు రగిల్చే ఆలోచనలకు స్వస్తి పలకాలని అన్నారు.

More Telugu News