Mahesh Bhagawat: ఘట్ కేసర్ యువతిపై అసలు అత్యాచారమే జరగలేదు: రాచకొండ సీపీ

  • విద్యార్థిని కిడ్నాప్ అంటూ పోలీసులకు ఫిర్యాదు
  • దుస్తులు చిరిగిపోయిన స్థితిలో కనిపించిన విద్యార్థిని
  • తనపై ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడి
  • పోలీసుల దర్యాప్తులో అత్యాచారం జరగలేదని తేలిన వైనం
  • ఆటోడ్రైవర్లు తప్పు చేయలేదన్న పోలీసులు
  • అమ్మాయే అబద్ధం చెప్పిందని తేల్చిన పోలీసులు
CP Mahesh Bhagawat reveals the truth behind Ghatkesar incident

గతంలో దిశ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఘట్ కేసర్ వద్ద ఓ బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారన్న ఉదంతం కూడా ఆందోళన కలిగించింది. అయితే ఈ కేసులో అసలు విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు.

అసలు ఆ అమ్మాయిపై అత్యాచారం జరగలేదని వెల్లడించారు. కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని భావించిన యువతి, తల్లి అదేపనిగా ఫోన్ చేస్తుండడంతో అబద్ధం ఆడిందని, పోలీసులను తప్పుదోవ పట్టించిందని తెలిపారు. అత్యాచార ఘటన ఆ అమ్మాయి అల్లిన కట్టుకథ అని వివరించారు. పైగా ఇందులో ఆటోడ్రైవర్ పై కక్ష కోణం కూడా ఉందని పేర్కొన్నారు.

"ఆ అమ్మాయి రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ నెల 10వ తేదీ సాయంత్రం డయల్ 100 నెంబరుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 5.30 గంటలకు రాంపల్లి బస్టాప్ వద్ద కాలేజీ బస్సు దిగిన విద్యార్థిని ఓ ఆటోలో ఎక్కగా, ఆ ఆటోడ్రైవర్ ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లిపోయాడంటూ మాకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు యువతి తన తల్లికి చెప్పగా ఆమె మాకు ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ నేపథ్యంలో సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశాం. వాహనాల తనిఖీ షురూ చేశాం. నిర్జన ప్రదేశాల్లోనూ గాలింపు జరిపాం. చివరికి 7.50 గంటలకు ఆ అమ్మాయి ఫోన్ నెంబరును ట్రాక్ చేయగలిగాం.

లొకేషన్ ను ట్రేస్ చేయగా అన్నోజిగూడ వద్ద ఉన్నట్టు వెల్లడైంది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లేసరికి దుస్తులు చిందరవందరగా ఉన్న స్థితిలో ఆ అమ్మాయి కనిపించింది. అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించాం. తనను ఆటోడ్రైవర్లు రేప్ చేశారని చెప్పింది. దాంతో ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. శాస్త్రీయకోణంలో దర్యాప్తు చేయగా ఆటోడ్రైవర్లు ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఆ అమ్మాయి పలు ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్టు వెల్లడైంది.

కేసు రీ కన్ స్ట్రక్షన్ లో ఆ అమ్మాయి అబద్దాలు చెప్పిన విషయం తేటతెల్లమైంది. వాస్తవ పరిస్థితులకు, ఆ విద్యార్థిని చెబుతున్న విషయాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. దాంతో ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పింది. కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్నానని వెల్లడించింది. గతంలో ఓ ఆటో డ్రైవర్ పై ఉన్న కోపాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంది. తనను కిడ్నాప్ చేశాడని తల్లికి చెప్పింది. దాంతో అది నిజమే అని నమ్మిన ఆ విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది" అని సీపీ మహేశ్ భగవత్ వివరించారు.

More Telugu News