Gram Panchayat Elections: ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు... సర్వం సిద్ధం

All set for second phase Panchayat Elections in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రేపు (ఫిబ్రవరి 13) రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రెండోదశలో 3,328 పంచాయతీల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, 33,570 వార్డుల్లో 12,604 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. రెండో దశ ఎన్నికలకు 29,304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో 5,480 సమస్యాత్మకం కాగా 4,181 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని ద్వివేది తెలిపారు.

రెండో దశ ఎన్నికల కోసం 47,492 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు ఉంటుందని, పోలింగ్, లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొవిడ్ వ్యాధిగ్రస్తులుంటే పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకోవాలని ద్వివేది సూచించారు.
Go Back to Shorts
Gram Panchayat Elections
Second Phase
Andhra Pradesh
Gopalakrishna Dwivedi

More Telugu News