Chandrababu: మహిళలను అసభ్యంగా దూషిస్తున్న ఆ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి: చంద్రబాబు

  • టీడీపీ హయాంలో ఏపీ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు
  • ఇప్పుడు కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
  • వినుకొండ మాజీ ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టడం దారుణం
Chandrababu demands for suspension of Vinukonda CI

ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏపీ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని... వారిలో కొందరు ఇప్పుడు వైసీపీ పాలనలో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని విమర్శించారు. గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దారుణమని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వినుకొండ సీఐ చిన్న మల్లయ్య వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికలను ఏకగ్రీవం చేయకపోతే కేసులు పెడతానని సీఐ బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. మహిళలను కూడా సీఐ అసభ్యంగా దూషిస్తున్నారని చెప్పారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... అందుకే పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కుయుక్తులకు పాల్పడినా ప్రజాభిప్రాయాలను మార్చలేరని చెప్పారు.

More Telugu News