Jayashankar Bhupalpally District: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన చిట్యాల సీఐ

  • హన్మకొండ కేయూసీ సమీపంలో కారులోనే పురుగుల మందు తాగిన సీఐ
  • గమనించి ఆసుపత్రిలో చేర్పించిన బ్లూకోల్ట్ పోలీసులు
  • ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలే కారణమంటూ సూసైడ్ లేఖ
Chityal CI Sai Ramana trying to suicide

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాయి రమణ వరంగల్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో కేయూసీ ఫిల్టర్ బెడ్ సమీపంలో తన కారులోనే ఆయన పురుగుల మందు తాగారు. ఆ తర్వాత కాసేపటికే అదే దారి గుండా వెళ్తున్న బ్లూకోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది అపస్మారకస్థితిలో కారులో పడి వున్న ఆయనను గమనించారు. అయితే, ఆయన సీఐ అని వారికి తెలియదు. 

అదే సమయంలో సీఐకి ఫోన్ రావడంతో పోలీసులు మాట్లాడడంతో ఆయన చిట్యాల సీఐ అని తెలిసింది. దీంతో వెంటనే ఆయనను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సీఐ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రమణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెంటనే హన్మకొండ వచ్చి చికిత్స పొందుతున్న సీఐని పరామర్శించారు.

More Telugu News