Vishnu Vardhan Reddy: ఒక్క‌సారి ఆలోచించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: వైసీపీ నేతలకు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి వార్నింగ్

  • వైసీపీ మంత్రుల‌ను, ఎమ్మెల్యేలను హెచ్చ‌రిస్తున్నా
  • ఇందిగా గాంధీతో మోదీని పోల్చుతున్నారు
  • వైసీపీ ప్రభుత్వ పాలన పరోక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది
vishnu vardha reddy slams ycp

భారత ప్రధాని మోదీ  గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా వైసీపీ నేత‌లు నోరు
అదుపులో పెట్టుకోవాల‌ని బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. విశాఖప‌ట్నం నుంచి  ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మాట మాట్లాడార‌ని, మోదీ గారి కంటే ఇందిరా గాంధీ 100 రెట్లు బలమైన నాయకురాలని అంటూ.. మోదీ ఎంత? అంటూ ఆయ‌న మాట్లాడుతున్నార‌ని విమర్శించారు.

కాంగ్రెస్ నుంచి పుట్టిన ఓ కొమ్మే వైసీపీ అని ఆయ‌న ఎద్దేవా చేశారు. సొంత గూటికి చేరే తాపత్రయంలో వైసీపీ ఉన్న‌ట్లుందని ఓ వీడియో రూపంలో ఆయ‌న‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. నాడు దేశంలో ఇందిరాగాంధీ ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ పెట్టార‌ని, ఇప్పుడు ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వ పాలన పరోక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన అన్నారు.

అందుకే, వైసీపీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తూ కాంగ్రెస్‌తో త‌మ‌ను పోల్చుకుంటారని ఎద్దేవా చేశారు. అప్ర‌క‌టిత ఎమర్జెన్సీని వైసీపీ అమ‌లు చేస్తోంద‌ని ఆరోపించారు. ఒక్క‌సారి ఆలోచించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని వైసీనీ మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను తాను హెచ్చ‌రిస్తున్నాన‌ని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News