prachanda: మాకు మ‌ద్ద‌తు ఇవ్వండి: ప్రపంచ దేశాల‌ను కోరిన ప్రచండ‌

prachanda asks india china support
  • పార్లమెంట్‌ను రద్దు చేసిన ఆప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌ధాని ఓలీ
  • అప్రజాస్వామికమ‌న్న ప్ర‌చండ‌
  • చ‌ర్య‌లు ప్రజాస్వామ్య పతనానికి దారితీశాయ‌ని వ్యాఖ్య

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీని త‌మ పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు‌ అధికార నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్ ఇస్తూ ఒక్క‌సారిగా పార్లమెంట్‌ను రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి ప్రధాని సిఫార్సు చేయ‌డం, వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంట్‌ను రద్దు చేయడం అంత‌కుముందే జ‌రిగిపోయాయి.

ప్ర‌స్తుతం ఓలీ ఆప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. దీంతో ఆయ‌న‌పై చేస్తున్న  పోరాటానికి భారత్‌తో పాటు ప్రపంచ దేశాలూ మద్దతివ్వాలని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చైర్‌పర్సన్ ప్రచండ తాజాగా కోరారు. కేపీశర్మ ఓలీ అప్రజాస్వామికంగా పార్లమెంట్‌ను  రద్దు చేశారని ప్ర‌చండ అన్నారు.

దీంతో ఆయ‌న చ‌ర్య‌లు ప్రజాస్వామ్య పతనానికి దారితీశాయ‌ని తెలిపారు. ఈ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం గమనించాలని, నేపాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. భారత్‌ చైనాతో పాటు అంతర్జాతీయ సమాజం త‌మ‌ అండగా నిలవాలని విన‌తి చేశారు.

అయితే, చైనా మద్దతుతోనే కేపీ శర్మ పార్లమెంట్‌ను రద్దు చేశారా?  అని మీడియా ప్రచండ‌ను ప్రశ్నించగా, నేపాల్ వ్యవహారాల్లో ఇతర దేశాలను తాము లాగలేమని అన్నారు. ఇటువంటి నిర్ణ‌యాల్లో దేశీయ నేతల నిర్ణయమే ఉంటుందని  చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలంటే పార్లమెంట్‌ను తిరిగి పునరుద్ధరించాలని తెలిపారు. పార్లమెంట్ రద్దును అప్రజాస్వామిక చర్య‌గా సుప్రీం కూడా సమర్థించదని తాము భావిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News