Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి 'నోటా'ను ప్రవేశపెడుతున్నాం: గోపాలకృష్ణ ద్వివేదీ

  • 3,594 హైపర్ సెన్సిటివ్... 3,458 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు
  • కోవిడ్ బాధితులకు చివరి గంట కేటాయింపు
  • తొలి విడత పోలింగ్ కోసం 29,732 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
NOTA introduced for the first time in Panchayat election says AP Panchayar Raj secretary

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రేపు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. కోవిడ్ బాధిత ఓటర్ల కోసం చివరి గంటను కేటాయించామని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పీపీఈ కిట్లను అందిస్తున్నామని తెలిపారు.
 
తొలి విడత ఎన్నికలకు సంబంధించి 3,249 గ్రామ పంచాయతీలకు గాను 525 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని ద్వివేది చెప్పారు. 32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. మిగిలిన 2,723 గ్రామ పంచాయతీలకు, 20,157 వార్డు మెంబర్లకు రేపు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తొలి విడత పోలింగ్ కోసం 29,732 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 3,594 హైపర్ సెన్సిటివ్... 3,458 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను గుర్తించామని తెలిపారు. ఈ స్టేషన్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ద్వివేది తెలిపారు. ఎన్నికల గుర్తుల్లో పొరపాట్లు చోటుచేసుకున్న నేపథ్యంలో, పశ్చిమగోదావరి జిల్లాలోని బొప్పాలపల్లి, వడ్డిగూడెంలో రేపు పోలింగ్ జరగడం లేదని... రెండో విడతలో ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు.

More Telugu News