Narendra Modi: ఆజాద్ ను పొగుడుతూ.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ

  • ఆజాద్ చాలా గౌరవంగా వ్యవహరిస్తారు
  • దుర్భాషలాడటం ఆయనకు అలవాటు లేదు
  • ఆజాద్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది
Modi praises Gulam Nabi Azad

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆజాద్ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై మోదీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆజాద్ చాలా గౌరవంగా వ్యవహరిస్తారని, దుర్భాషలాడటం ఆయనకు అలవాటు లేదని చెప్పారు. ఈ విషయంలో ఆయన పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. ఆయన నుంచి ఈ లక్షణాన్ని మనం నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరిగిన తీరును ఆజాద్ ప్రశంసించారని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానానికి 23 మంది సీనియర్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిని జీ-23గా పిలుస్తున్నారు. ఈ 23 మందిలో ఆజాద్ కూడా ఉన్నారు. దీనిపై మోదీ మాట్లాడుతూ, ఆజాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని పొందాలని చెప్పారు. ఆయన చెప్పిన మాటలను జీ-23 అభిప్రాయాలుగా ఆ పార్టీ హైకమాండ్ చూడకూడదని ఎద్దేవా చేశారు.

కరోనా సమయంలో విపక్ష నేతలంతా చాలా కాలం పాటు ఇంట్లోనే హాయిగా గడిపారని విమర్శించారు. కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేసిందని చెప్పారు. తాను, తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విపక్షాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, తనను విమర్శించిన తర్వాత వారి మనసులు తేలిక పడ్డాయని అన్నారు. తాను విఫలమైన పక్షంలో... అధికారంలోకి వచ్చేందుకు వచ్చిన అవకాశాన్ని విపక్షాలు అందిపుచ్చుకోవాలని సవాల్ విసిరారు. 

More Telugu News