COVID19: 57 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్​.. ఎక్కువ మందికి వ్యాక్సిన్​ వేసిన దేశాల జాబితాలో భారత్​ కు మూడో స్థానం

  • 3.68 కోట్ల మందితో ప్రథమ స్థానంలో అమెరికా
  • బ్రిటన్ లో 1.15 కోట్ల మందికి టీకా.. రెండో స్థానం
  • కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
57 Lakh Get Coronavirus Vaccine Shots In India 3rd Highest After US and UK

కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 57 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం టీకా వేసింది. దీంతో ప్రపంచంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసిన దేశాల్లో భారత్ మూడో స్థానాన్ని సాధించింది. దీనికి సంబంధించి ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ లున్నట్టు పేర్కొంది.

దేశంలో ఇప్పటిదాకా 53,04,546 మంది వైద్య సిబ్బంది, 4,70,776 మంది ముందు వరుస యోధులకు టీకా వేసినట్టు వెల్లడించింది. మొత్తంగా 57,75,322 మందికి టీకా వేసినట్టు చెప్పింది. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటిదాకా 1,15,178 సెషన్లను నిర్వహించినట్టు చెప్పింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ లో 6,73,542 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, ఆ తర్వాత మహారాష్ట్రలో 4,73,480 మంది, రాజస్థాన్ లో 4,59,652 మందికి కరోనా టీకాలు వేసినట్టు పేర్కొంది. 12 రాష్ట్రాల్లో 2 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లు తీసుకున్నట్టు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో 2,99,649 మందికి, తెలంగాణలో 2,09,104 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొంది.

వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 20లోపు కనీసం ఒక్కసారైనా ఎక్కువ మంది వైద్య సిబ్బందికి కరోనా టీకాలు వేయాలని ఆదేశించింది. కాగా, అమెరికాలో ఇప్పటిదాకా 3.68 కోట్ల మందికి, బ్రిటన్ లో 1.15 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు.

More Telugu News