IYR Krishna Rao: మరో ఉద్యమం ఎందుకు తప్పదో చంద్ర‌బాబు సెలవిస్తే బాగుంటుంది: ఐవైఆర్‌

  • విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటుపరంపై చంద్ర‌బాబు వ్యాఖ్య‌లకు కౌంట‌ర్
  • తెలంగాణ ఆత్మగౌరవం నిజాం షుగర్స్
  • తమరు అధికారంలో ఉన్నప్పుడే అమ్మడం జరిగింది
  • ప్రభుత్వ  సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికారు
iyr slams chandrababu

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న‌ హెచ్చరించారు.  ఉక్కు కర్మాగారాన్ని తుక్కు కింద కొనేసి రూ.లక్షల కోట్లు కొట్టేద్దామనే ఏపీ సీఎం జగన్‌ గ్యాంగ్‌ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుంటామంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించిన వార్త‌ను ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు  పోస్ట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'మరో ఉద్యమం ఎందుకు తప్పదో వివరంగా సెలవిస్తే బాగుంటుంది. తెలంగాణ ఆత్మగౌరవమైన నిజాం షుగర్స్ ను తమరు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి పారదర్శకత లేని విధానం ద్వారా అమ్మడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికిన రాష్ట్రస్థాయి నాయకులలో తమరు ముందున్నారు' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.

కాగా, ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే ఆ బిడ్డింగ్ లో త‌మ‌ ప్రభుత్వం పాల్గొనడం జరుగుతుందంటూ వైసీపీ మంత్రులు అంటున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆరోపించారు. ఇందులో మరో కుట్ర కోణం ఉన్నట్లు ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రైవేటీకరణ పేరుతో మీరే బిడ్డింగ్ లో ఉంటే సొంత వాళ్ల‌కి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఇది కేంద్రం అధీనంలోనే ఉండాలని ఆయ‌న చెప్పారు.


More Telugu News