Kamala Harris: న్యూఢిల్లీలో కమలా హ్యారిస్ మేనకోడలి దిష్టి బొమ్మలు దగ్ధం... భయపడేది లేదన్న మీనా హ్యారిస్!

  • రైతులకు మద్దతుగా మీనా హ్యారిస్ వ్యాఖ్యలు
  • విదేశీయుల జోక్యంపై యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆగ్రహం
  • తానిలానే మాట్లాడతానన్న మీనా
Hindu Front Activists Angry over Meena Harris

దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు రెండున్నర నెలలుగా సాగు చట్టాల రద్దును కోరుతూ నిరసనలు తెలుపుతున్న రైతులకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ మద్దతు తెలుపగా, యునైటెడ్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, దిష్టి బొమ్మలను, పోస్టర్లను దగ్ధం చేశారు. ఇండియా అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకుంటే సహించబోమని ఈ సందర్భంగా వారు పోస్టర్లను ప్రదర్శించారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకున్న మీనా హ్యారిస్ సైతం ఘాటుగానే స్పందించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "నేను ఇండియాలోని రైతుల మానవ హక్కులను కాపాడటం కోసం మాట్లాడాను. ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూడండి. నేనిలానే మాట్లాడతాను. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంలో నెల రోజుల క్రితం ఏం జరిగిందో చూశాం. దానిపై మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇండియాలో ఇంటర్నెట్ ను ఆపేస్తున్నారు. పారామిలిటరీ దళాలు రైతులపై దాడులు చేస్తున్నాయి" అని అన్నారు.

More Telugu News