Mahesh Babu: దుబాయ్ లో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో చెప్పిన మహేశ్ బాబు!

  • మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట' 
  • గత కొన్ని రోజులుగా దుబాయ్ లో షూట్
  • 'ఇన్5'లో షూటింగ్ చేస్తున్నట్టు వెల్లడి  
  • అద్భుతమైన అనుభవమన్న మహేశ్ 
Mahesh Babu says its an amazing experience shooting at in5 dubai

గతేడాది విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తాజా చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి విదితమే. 'సర్కారు వారి పాట' పేరిట ఈ చిత్రం ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకుంటున్న బ్యాంకు కుంభకోణాల కథా నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగును గత కొన్ని రోజులుగా దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.

ఇక దుబాయ్ లో ఈ  చిత్రం షూటింగు ఎక్కడ జరుగుతోందన్న దానిపై హీరో మహేశ్ బాబు తాజాగా అప్ డేట్ ఇచ్చాడు. దుబాయ్ లోని 'ఇన్ 5' (in5 dubai) బిల్డింగులో షూటింగ్ జరుగుతోందని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

"ఇన్5 దుబాయ్ లో షూటింగు చేయడం ఒక అద్భుతమైన అనుభవం.. తపనగల పారిశ్రామికవేత్తలు, స్టార్ట్ అప్స్ నెలకొల్పే వారి ఆలోచనలకు వాస్తవరూపాన్ని వీరు ఏ విధంగా కల్పిస్తారన్నది చూస్తే నిజంగా ముగ్ధులమవుతాము' అంటూ ఇన్5 గొప్పతనాన్ని మహేశ్ ప్రశంసిస్తూ, సంస్థ భవనం ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రం షూటింగులో మహేశ్ , కీర్తి సురేశ్ లతో పాటు ఇతర ముఖ్య నటీనటులు కూడా పాల్గొంటున్నారు.  

More Telugu News