Jyotiraditya Scindia: జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్​ సింగ్​ ల మధ్య మాటల యుద్ధం

  • కాంగ్రెస్ వి ద్వంద్వ విధానాలని సింధియా మండిపాటు
  • సాగు చట్టాలపై నాడు మేనిఫెస్టోలో పెట్టిందన్న మాజీ కాంగ్రెస్ నేత
  • ఏపీఎంసీలో మార్పులు చేయాలని లేఖ కూడా రాసిందని వెల్లడి
  • 'వాహ్ మహారాజా గారూ వాహ్' అంటూ కౌంటర్ ఇచ్చిన దిగ్విజయ్
  • యూపీఏ విధానాలను బలవంతంగా వ్యక్తపరిచినట్టే.. బీజేపీ విధానాలనూ వ్యక్తపరుస్తున్నారని ఎద్దేవా
Jyotiraditya Scindia Digvijaya Singhs Amusing Exchange In Parliament

బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ల మధ్య రాజ్యసభలో మాటల యుద్ధం జరిగింది. రైతుల ఆందోళనలపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ముందుగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. సాగు చట్టాలపై కాంగ్రెస్ మాట మార్చిందంటూ మండిపడ్డారు. ఆ పార్టీది ద్వంద్వ వైఖరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సాగు సంస్కరణలు అవసరమంటూ కాంగ్రెస్ పేర్కొందని ఆయన గుర్తు చేశారు.

‘‘2010–2011లో నాటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్.. వ్యవసాయంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం అవసరమంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారు. సంస్కరణలు రావాలంటే రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లో సవరణలు చేయాలని ఆ లేఖలో సూచించారు. ఇప్పుడేమో చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ద్వంద్వ విధానాలను అవలంబించే అలవాటునే కాంగ్రెస్ మానుకోవాలి’’ అని ఆయన మండిపడ్డారు.

వెంటనే దీనికి దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘సింధియా గారూ.. మీకు అభినందనలు. ఇంతకుముందు మీరు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విధానాలను సభలో ఏ విధంగానైతే బలవంతంగా వ్యక్తపరిచారో.. ఇప్పుడు బీజేపీ విధానాలనూ అలాగే వ్యక్తపరుస్తున్నారు. వాహ్ మహారాజా గారూ.. వాహ్’’ అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బదులుగా ‘‘అంతా మీ చలవే’’ అంటూ సింధియా కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతిగా.. ‘‘నువ్వు ఏ పార్టీలో ఉన్నా.. నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది’’ అని దిగ్విజయ్ స్పందించారు. ఈ మాటతో సభలో నవ్వులు పూశాయి.

More Telugu News