India: బడ్జెట్ 2021-2022... లాభం ఎవరికి? నష్టం ఎవరికి?

  • కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ
  • వృద్ధి రేటుపైనే దృష్టి సారించిన నిర్మలమ్మ
  • లాభాల బాటన ఆసుపత్రులు, మెటల్స్, బ్యాంకులు
  • నష్టపోనున్న దిగుమతిదారులు, ఐటీ కంపెనీలు, రైతులు
Who Will Gain and Who Will Loss After Budget

గత సంవత్సరం కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా, ఈ సంవత్సరం వృద్ధి రేటును భారీగా పెంచే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రతిపాదనలను సోమవారం నాడు పార్లమెంట్ ముందుంచారు.

ఈ బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని పరిశీలిస్తే, మహమ్మారి చూపించిన ప్రభావం నుంచి దేశాన్ని కాపాడటంతో పాటు, తిరిగి నిలిపేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గమనించిన స్టాక్ మార్కెట్ వర్గాలు సైతం కొనుగోళ్లకు దిగడంతో, ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా, 2,300 పాయింట్లకు పైగా లాభంలో పరుగులు పెట్టింది. ఇక ఈ బడ్జెట్ తరువాత లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అన్న విషయాలను పరిశీలిస్తే...

విన్నర్స్...

ఆసుపత్రులు: గడచిన 100 సంవత్సరాల వ్యవధిలో, అత్యంత ప్రభావం చూపిన కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తున్న ఆసుపత్రులకు... అంటే వైద్య ఆరోగ్య రంగానికి 137 శాతం అధిక కేటాయింపులు లభించాయి. ఇది మొత్తం జీడీపీలో 2 శాతానికి సమానం. గత బడ్జెట్ లలో హెల్త్ కేర్ కు ఇంత మొత్తం కేటాయింపులు ఎన్నడూ చూడలేదు. ఈ ప్రభావం అపోలో హాస్పిటల్స్, మాక్స్ హెల్త్ కేర్, నారాయణ హృదయాలయా తదితర కంపెనీలతో పాటు మెట్రోపోలిస్ హెల్త్ కేర్, థైరోకేర్ టెక్నాలజీస్, డాక్టర్ లాల్ పాథ్ లాబ్స్ తదితర సంస్థలపైనా పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది.

మెటల్ తయారీ సంస్థలు: ఈ బడ్జెట్ లో మెట్రోలు, ఇతర పట్టణాల మధ్య 11 వేల కిలోమీటర్ల రహదారులను ప్రకటించారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పాత వాహనాల స్క్రాప్ పై కొత్త పాలసీ కూడా వచ్చింది. ఈ నిర్ణయంతో జిందాల్ స్టీల్ అండ్ పవర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, వేదాంత, హిందుస్థాన్ కాపర్ తదితర సంస్థలు లాభపడనున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు: బ్యాంకుల్లో నానాటికీ పెరిగిపోతున్న నిరర్ధక ఆస్తుల కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం భారత చరిత్రలో కీలకమైన మార్పు కాబోతుందని విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేశారు. ఆస్తుల నిర్వహణ విషయంలో బ్యాంకులకు ఈ నిర్ణయం ఉపకరించనుంది. దీంతో పీఎస్యూ బ్యాంకులైన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యూనియన్ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితరాలు లాభపడనున్నాయి.

టెక్స్ టైల్స్: వచ్చే మూడేళ్లలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఏడు మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రేమాండ్ లిమిటెడ్, ట్రైడెంట్ లిమిటెడ్, అరవింద్ లిమిటెడ్, సెంచరీ టెక్స్ టైల్స్ తదితర కంపెనీలు లాభపడనున్నాయి.

లూజర్స్...

బాండ్స్: గతంలో అంచనా వేసిన మొత్తం కన్నా మరింతగా రుణాలను తీసుకోవాలని, అందుకు సావరిన్ బాండ్ల విక్రయాలను మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 154 బిలియన్ డాలర్లకు మించి నిధులను సమీకరించాలని ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి అదనంగా మరో రూ. 80 వేల కోట్లను కూడా సేకరించనున్నట్టు నిర్మలమ్మ తెలిపారు. దీంతో బాండ్ల కొనుగోలుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపక పోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిజిన్వెస్ట్ మెంట్ ప్రణాళికలు కూడా ఆయా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

దిగుమతిదారులు: దిగుమతి సుంకాలను కేంద్రం పెంచింది. సోలార్, మొబైల్ ఫోన్లు, వాహన విడిభాగాలు తదితరాలను ఇంపోర్ట్ చేసుకుంటే మరింత పన్నులను చెల్లించాల్సిందే. ఆత్మ నిర్భర భారత్, మేడిన్ ఇండియాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయాలని కేంద్రం పేర్కొన్నా, ఇండియా ప్రస్తుతం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలపై ప్రభావం పడుతుందని, ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ కంపెనీలకు నష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రైతులు, గ్రామీణ భారతావని: ఈ బడ్జెట్ తరువాత వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ భారత ప్రజలు కొంత భారాన్ని మోయాల్సిందే. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని ఆపేలా ఎటువంటి నిర్ణయమూ వెలువడలేదు. కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రకటనా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు 73 వేల కోట్లను కేటాయిస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించడం ఒక్కటే శుభ పరిణామం.

ఐటీ కంపెనీలు: ఇండియా నుంచి అత్యధిక ఎగుమతి వాణిజ్యాన్ని అందిస్తున్న ఐటీ కంపెనీలకు ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో పెద్దగా లాభం కలగలేదు. ఐటీ రంగానికి ఎటువంటి రాయితీలనూ నిర్మలమ్మ ప్రకటించలేదు. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా తదితర దిగ్గజాలతో పాటు మైండ్ ట్రీ, పర్సిస్టెంట్, హెక్సావేర్, ఎల్టీఐ తదితర మధ్య తరహా ఐటీ కంపెనీలకు కూడా నష్టమే.

More Telugu News