USA: అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం

  • డేవిస్ నగరంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న భారతీయ అమెరికన్లు
  • దుండగులను వదలబోమన్న సిటీ కౌన్సిల్  సభ్యుడు
Mahatma Gandhi statue vandalised in USA

అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని మరోసారి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని డేవిస్ నగరంలో ఉన్న సెంట్రల్ పార్కులో ఈ ఘటన జరిగింది. ఆరు అడుగుల ఎత్తు, 294 కిలోల బరువు గల గాంధీ విగ్రహాన్ని కిందకు పడేశారు. విగ్రహాన్ని కొంత దూరం లాక్కెళ్లి పడేసి వెళ్లిపోయారు. విగ్రహం తల కూడా పగిలిపోయింది. ఈ నెల 27న ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగుచూసింది. విగ్రహం కింద పడిపోయి ఉండడాన్ని చూసిన పార్కు ఉద్యోగి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

ఈ ఘటనపై సిటీ కౌన్సిల్ సభ్యుడు మాట్లాడుతూ, ధ్వంసమైన విగ్రహాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించామని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వదిలి పెట్టబోమని అన్నారు. మరోవైపు సిటీ పోలీస్ డిప్యూటీ చీఫ్ రోడోషోవ్ మాట్లాడుతూ, ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నామని, దుండగులను పట్టుకుంటామని చెప్పారు.

ఈ ఘటనపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన దుండగులను వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనలు విద్వేషాలను రెచ్చగొడతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News