Raja Singh: బీఫ్ ఫెస్టివల్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఏడాది జైలు శిక్ష

  • 2015లో ఉస్మానియాలో విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్
  • తానేంటో చూపిస్తానంటూ రాజా సింగ్ హెచ్చరిక 
  • దాద్రీ తరహా ఘటనలు హైదరాబాదులోనూ చూస్తారని వార్నింగ్
  • సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Nampally court impose one year imprisonment for BJP MLA Raja Singh

బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. 2015 నాటి బీఫ్ ఫెస్టివల్ (పెద్ద కూర పండుగ) వివాదంలో రాజా సింగ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు విచారణ సాగగా, ఇవాళ నాంపల్లి కోర్టు రాజా సింగ్ కు జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన బెయిల్ కు దరఖాస్తు చేయగా, న్యాయస్థానం అందుకు సమ్మతిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని రాజా సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.

2015లో ఉస్మానియా వర్సిటీలో ఓ విద్యార్థి వర్గం బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారన్న వార్తలతో రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. దాద్రీ తరహా ఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలతో రాద్ధాంతం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసులోనే ఆయనకు ఏడాది జైలు శిక్ష పడింది.

More Telugu News