India Justice Report: న్యాయం అందించడంలో తెలంగాణకు 3వ స్థానం.. భారత న్యాయ నివేదికలో 8 స్థానాలు పైకి

  • ప్రథమ స్థానంలో నిలిచిన మహారాష్ట్ర
  • రెండో ర్యాంకు దక్కించుకున్న తమిళనాడు
  • టాప్ టెన్ లో చోటు దక్కించుకోని ఏపీ
  • హైకోర్టు మహిళా జడ్జిల్లో ఆ రాష్ట్రానిదే ప్రథమ స్థానం
Telangana rises 8 spots to be no 3 in delivering justice to people

బాధితులకు సత్వర న్యాయం అందించడంలో తెలంగాణ గతంతో పోలిస్తే మెరుగుపడింది. 8 స్థానాలు పైకి ఎగబాకింది. తాజాగా విడుదల చేసిన భారత న్యాయ నివేదికలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సామాజిక న్యాయ కేంద్రం, కామన్ కాజ్, కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, దక్ష్, టిస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వంటి సంస్థలతో కలిసి టాటా ట్రస్ట్ ఈ నివేదికను విడుదల చేసింది. పోలీసు, జైళ్లు, కోర్టులు, న్యాయ సాయం వంటి నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని నివేదికను తయారు చేసింది.

కోటికిపైగా జనాభా ఉన్న పెద్ద, మధ్య స్థాయి రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రకు ప్రథమ స్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు నిలిచింది. గత నివేదికలో 11వ ర్యాంకు సాధించిన తెలంగాణ.. ఇప్పుడు 3వ ర్యాంకుకు ఎగబాకింది. పంజాబ్, కేరళలు నాలుగు, ఐదో స్థానాలను దక్కించుకున్నాయి. అయితే, టాప్ టెన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కు చోటు దక్కలేదు.

కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ప్రథమ ర్యాంకు దక్కగా.. సిక్కిం, గోవాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రాలు తమ తమ వ్యవస్థలను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ లోకూర్ సూచించారు. అందుకు నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీల సాయం తీసుకోవాలన్నారు. పోలీస్, న్యాయ సాయం, కోర్టుల ద్వారా సామాన్యులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు.

కాగా, 1995 నుంచి 25 ఏళ్లలో దాదాపు ఒకటిన్నర కోట్ల మంది న్యాయ సాయం పొందినట్టు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా జడ్జిలు 29 శాతమేనని పేర్కొంది. అయితే, గతంతో పోలిస్తే నాలుగు విభాగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందని సంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తంగా మహిళా పోలీసుల సంఖ్య పెరిగినా.. మహారాష్ట్రలో మాత్రం 10 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొంది.

హైకోర్టు మహిళా జడ్జిల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. 19 శాతం మంది మహిళా జడ్జిలున్నారు. ఆ తర్వాత 18.2 శాతం మహిళా జడ్జిలతో హర్యానా రెండో స్థానాన్ని సాధించింది. తమిళనాడు (16.7%) మూడో ర్యాంకు దక్కించుకుంది.

18 పెద్ద, మధ్య స్థాయి రాష్ట్రాల్లో సబార్డినేట్ కోర్టుల్లో 33 శాతం మంది మహిళా జడ్జిలు సేవలందిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లలో 40 శాతం కన్నా ఎక్కువే ఉన్నారు. పోలీస్, జైళ్లు, కోర్టులు, న్యాయ సాయం.. ఈ నాలుగు విభాగాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ 25 శాతానికిపైగా ఖాళీలున్నట్టు నివేదిక పేర్కొంది.

ఇక,25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని  జైళ్లలో ఖైదీలూ పెరిగిపోతున్నారు. హైకోర్టులో కేసు విచారణను ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడమే దానికి కారణమని నివేదిక పేర్కొంది. 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని జైళ్ల సామర్థ్యంలో 50 శాతం కన్నా ఎక్కువ మంది ఖైదీలున్నారు.

More Telugu News