Virat Kohli: విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

  • ఆన్ లైన్ రమ్మీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కోహ్లీ
  • కోహ్లీపై కేరళ హైకోర్టులో పిటిషన్
  • యువతను చెడగొడుతున్నారంటూ ఆరోపణ
Kerala High Court serves notice to Virat Kohli

ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్లలో సినీ, క్రీడా తారలు ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువ పాప్యులారిటీ ఉన్న వారు ఒక్కో బ్రాండ్ కు ప్రచారం చేసినందుకు గాను ఏడాదికి కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు.

అలాంటి క్రీడాకారుల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న వ్యక్తి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఒక అంచనా ప్రకారం ఇండియాలో యాడ్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నది కోహ్లీనే. ఎన్నో బ్రాండ్లకు కోహ్లీ అంబాసిడర్ గా ఉన్నాడు. యాడ్స్ ద్వారా ఆయన ఆదాయం ప్రతి ఏడాది వందల కోట్లలోనే ఉంటుంది. అయితే, తాజాగా కోహ్లీకి ఒక ఇబ్బంది వచ్చి పడింది.

ఆన్ లైన్ రమ్మీ గేమ్ కు ప్రచారం చేస్తున్న కోహ్లీపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆన్ లైన్ రమ్మీ వల్ల ఎంతో మంది డబ్బు కోల్పోయి, ప్రాణాలు తీసుకుంటున్నారని ఒక వ్యక్తి పిటిషన్ వేశాడు. ఎంతో ఫాలోయింగ్ ఉండే బ్రాండ్ అంబాసిడర్ల వల్ల యువత వీటికి ఆకర్షితులవుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

కేరళకు చెందిన వినీత్ అనే కుర్రాడు ఆన్ లైన్ రమ్మీ వల్ల రూ. 21 లక్షలు కోల్పోయి, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఆన్ లైన్ రమ్మీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న కోహ్లీతో పాటు, సినీ నటులు తమన్నా, అజూ వర్గీస్ లకు నోటీసులు జారీ చేసింది.

More Telugu News