Gopala Krishna Dwivedi: గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్‌ఈసీ

  • ఎన్నికల ప్రక్రియ కీలక సమయంలో ఉన్నప్పుడు బదిలీలు తగవన్న ఎస్‌ఈసీ
  • బదిలీలు చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలి
  • కొత్తగా వచ్చే సిబ్బందితో ఇబ్బందులు ఉంటాయన్న ఎన్నికల సంఘం
SEC Rejects transfers of gopala krishna dwivedi and girija shankar

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు చేయడం సరికాదని పేర్కొంది. ఒకవేళ బదిలీలు చేయాలని భావిస్తే కనుక ఎన్నికల విధివిధానాలను తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఎస్‌ఈసీ ఈ ఉదయం పేర్కొంది.  పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇకపై ఎంతమందిని బదిలీ చేసుకున్నా తాము పట్టించుకోబోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్‌సీఈ ఈ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News