COVID19: ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి వ్యాక్సిన్​.. ఒక్క రోజే 3.4 లక్షల మందికి: భారత్​ రికార్డ్​

  • మొత్తంగా 13.9 లక్షల మందికి కరోనా టీకాలు
  • పది లక్షల మార్కును దాటడానికి అమెరికాకు 10 రోజుల టైం
  • ఏకంగా 18 రోజులు తీసుకున్న బ్రిటన్
Over 3 Lakh People Vaccinated In A Day For First Time Total 14 Lakh

కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టబోతున్నారని తెలియగానే ప్రపంచం కళ్లన్నీ మనదేశంపైనే కేంద్రీకృతమయ్యాయి. విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జనవరి 16న మొదలైన టీకాల పంపిణీకి శుక్రవారంతో వారం రోజులు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వారంలోనే దాదాపు 14 లక్షల మందికి టీకాలు వేశారు.

ఈ వారంలోనే  13,90,592 మందికి టీకాలు వేసింది మన ప్రభుత్వం. ఆరు రోజుల్లోనే పది లక్షల మార్కును దాటింది. అంటే గురువారం నాటికే 10.4 లక్షల మందికి టీకాలు పడ్డాయి. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,47,058 మందికి టీకాలు వేశారు. ఏ విధంగా చూసినా ఇది ఒక రికార్డే. టీకా పంపిణీ మనకన్నా ముందే ప్రారంభమైన మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర చాలా వేగంగా జరుగుతోంది.

మొత్తంగా ఇప్పటిదాకా అమెరికాలో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. గత ఏడాది డిసెంబర్ 14న వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన ఆ దేశంలో పది లక్షల మందికి టీకాలు వేయడానికి 10 రోజులు పట్టింది. ఇక, డిసెంబర్ 8న వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన బ్రిటన్ .. పదిలక్షల మార్కును 18 రోజుల్లో చేరింది. మొదటి వారంలో కేవలం లక్షా 30 వేల మందికే ఆ దేశం టీకాలు వేయగలిగింది.

మరోవైపు జనవరి 20 నాటికే 1.5 కోట్ల మందికి చైనా టీకాలు వేసినట్టు తెలుస్తోంది. నిజానికి దానికి సంబంధించిన అధికారిక లెక్కలేవీ బయటకు తెలియరాలేదు. అయితే, నవంబర్ లోనే పది లక్షల మందికిపైగా వ్యాక్సిన్లు వేసినట్టు చైనా ప్రభుత్వ సంస్థ అయిన సినోఫార్మ్ గ్రూప్ అధిపతి చెబుతున్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 5.7 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 1.5 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్ లో 54 లక్షల మందికి, ఇజ్రాయెల్ లో 33 లక్షలు, యూఏఈలో 23 లక్షలు, జర్మనీలో 14 లక్షలు, ఇటలీలో 13 లక్షలు, టర్కీలో 11 లక్షలు, స్పెయిన్ లో 11 లక్షల మందికి టీకాలు వేశారు. గురువారం నాటికి 10.4 లక్షల మందికి టీకాలు వేసిన భారత్ ఆ టైంకు టాప్ టెన్ లో నిలిచింది.

More Telugu News