V Doraswami Raju: ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూత!

  • గత కొద్ది రోజులుగా అనారోగ్యం
  • కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన దొరస్వామి రాజు
Famous Tollywood Producer V Doraswami Raju Passes Away

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, రాజకీయంగానూ రాణించిన వి.దొరస్వామి రాజు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించగా, కొంతకాలంగా బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అయితే, పరిస్థితి విషమించి, ఆయన తుది శ్వాస విడిచారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

కాగా, వీఎంసీ పేరిట డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించిన ఆయన, అదే బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన వేటగాడు, యుగంధర్, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలతో పాటు ఏఎన్నార్ నటించిన ప్రేమాభిషేకం చిత్రాలను ఆయన వీఎంసీ ద్వారా విడుదల చేశారు.

ఆపై సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్లాం, వెంగమాంబ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 90వ దశకంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన దొరస్వామి రాజు, 1994లో చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దొరస్వామి రాజు మరణ వార్తను గురించి తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

More Telugu News