Jakartha: థౌజండ్ ఐలాండ్స్ వద్ద కూలిన విమానం శకలాలు... 62 మంది జలసమాధి!

  • నిన్న జకార్తా సమీపంలో అదృశ్యం
  • మానవ శరీర భాగాలను గుర్తించిన సెర్చ్ అధికారులు
  • రంగంలో ఆస్ట్రేలియాకు చెందిన శాటిలైట్లు
Flight Debris Found near Thousand Ilands

ఇండొనేషియా రాజధాని జకార్తా నుంచి పోంటియానక్ దీవికి బయలుదేరిన శ్రీ విజయ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం నిన్న జావా సముద్రంలో కుప్పకూలగా, విమానం శకలాలను థౌజండ్ ఐలాండ్స్ వద్ద గుర్తించామని అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న 62 మంది జలసమాధి అయ్యుండవచ్చని, వారి ఆచూకీ గురించి నాలుగు యుద్ధ విమానాలు, నౌకలతో గాలింపు చర్యలను ముమ్మరంగా చేస్తున్నామని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఐరావతి తెలిపారు. ఇందుకోసం జాతీయ రవాణా భద్రత కమిటీతో పాటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీ రంగంలోకి దిగాయని అన్నారు.

టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయని, ఆ సమయంలో 29 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం, నిమిషం వ్యవధిలోనే 10,600 అడుగుల కిందకు జారిపోయిందని తెలిపిన ఇండోనేషియా మంత్రి బూది కార్య, గాలింపు చర్యల్లో పాల్గొంటున్న త్రిశూల్ కోస్ట్ గార్డ్ కమాండర్లు విమానం శకలాలను, మానవ శరీర భాగాలను గుర్తించారని వెల్లడించారు. విమానం ఎక్కడ కూలిందన్న విషయాన్ని గుర్తించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాటిలైట్ వ్యవస్థను కూడా వినియోగించుకుంటున్నామని ఈఎల్టీ (ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్ మీటర్) సంకేతాల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

కాగా, ఈ విమానాన్ని 26 సంవత్సరాల క్రితం శ్రీ విజయ ఎయిర్ లైన్స్ కొనుగోలు చేసింది. 1994లో తొలిసారిగా వినియోగంలోకి వచ్చింది. ఈ విమానాన్ని త్వరలోనే గ్రౌండింగ్ చేయాలని సంస్థ భావిస్తుండగా, అంతలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఇదిలావుండగా, విమాన ప్రమాదాలు ఇండోనేషియాలో అధికం. 1997లో జరిగిన ఓ ప్రమాదంలో 234 మంది, ఆపై 2014లో జరిగిన ప్రమాదంలో 162 మంది మరణించగా, 2018లో లయన్ ఎయిర్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలగా, 189 మంది ప్రాణాలను కోల్పోయారు.

More Telugu News