Sunkara Padmasri: బీజేపీ ట్రాప్ లో వైసీపీ, టీడీపీ: కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ

  • ఏపీ రాజకీయాలు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి
  • 150 దేవాలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది?
  • సమస్యలు విలయతాండవం చేస్తుంటే జగన్ కు పట్టదా?
TDP and YSRCP are in BJP trap says Sunkara Padmasri

ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం పక్కకు వెళ్లిపోయిందని... రాజకీయాలు మొత్తం దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. బీజేపీ అడుతున్న దేవుడి ఆటలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలూ పావులుగా మారాయని అన్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలు దేవుడిని కూడా ప్రశాంతంగా ఉంచడం లేదని దుయ్యబట్టారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 150 వరకు దేవాలయాలపై దాడులు జరిగాయని... ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తమకు బీజేపీపైనే అనుమానాలు ఉన్నాయని... బీజేపీనే దాడులు చేయించి నాటకం ఆడుతోందని అనుమానిస్తున్నామని అన్నారు.

మతాన్ని అడ్డుపెట్టుకుని బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోందని పద్మశ్రీ చెప్పారు. బీజేపీ నాటకంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ పాల్గొంటూ జనాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తుంటే జగన్ కు పట్టదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల బాధ ప్రభుత్వం పట్టించుకోదా? అని అడిగారు. రాజకీయాలంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమేనా? అని మండిపడ్డారు. బీజేపీ వేస్తున్న ఉచ్చులో టీడీపీ, వైసీపీ నేతలు పడొద్దని హెచ్చరించారు.

More Telugu News