SBI: 8 బ్యాంకులకు రూ.4,837 కోట్లు టోపీ పెట్టిన హైదరాబాద్​ సంస్థ!

  • ఎస్బీఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ
  • తీసుకున్న రుణాలు సొంత ఖాతాల్లోకి
  • తిరిగి చెల్లించకుండా సంస్థ మోసం
  • మోసానికి సహకరించిన కొందరు ప్రభుత్వాధికారులు
CBI books Hyderabad based infra firm IVRCL for defrauding 8 public banks of Rs 4800 crore

కొన్ని వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. ఇప్పుడు అదే జాబితాలో హైదరాబాద్ కు చెందిన మరో వ్యాపారి చేరిపోయాడు. విదేశాలకైతే పారిపోలేదుగానీ.. 8 బ్యాంకులకు రూ.4,837 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడు. ఆ బ్యాంకులన్నింటికీ నేతృత్వం వహిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదుతో ఆయనగారి బాగోతం బయటపడింది. సీబీఐ కేసు నమోదు చేసింది.

ఐవీఆర్ సీఎల్ అనే మౌలిక వసతుల సంస్థ తమ నేతృత్వంలోని 8 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసిందని సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ అధికారులతో కలిసి బ్యాంకులను సంస్థ ముంచిందని పేర్కొంది. ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి ఐవీఆర్ సీఎల్ రుణాలు తీసుకుంది.

ఎస్బీఐ ఫిర్యాదుతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇ. సుధీర్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. బలరామిరెడ్డి, తప్పుడు మార్గాల్లో రుణాలు ఇచ్చేందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారి ఆర్కే గౌర్ వెల్లడించారు. వేరే పార్టీలకు పేమెంట్ చేయాల్సి ఉందని చెప్పి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (రుణ పత్రం) కింద బ్యాంకుల నుంచి సంస్థ రుణాలు తీసుకున్నా.. వాటిని తిరిగి చెల్లించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఆ మొత్తాన్ని అడ్డదారుల్లో సంస్థ ఖాతాల్లోకి మళ్లించిందని వివరించారు.

ఫిర్యాదుల నేపథ్యంలో హైదరాబాద్ లోని నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. కాగా, ఐవీఆర్ సీఎల్ సంస్థ 25 ఏళ్లుగా పర్యావరణం, నీటిపారుదల, రవాణా, నిర్మాణ రంగం, విద్యుత్ సరఫరా, గనుల రంగాల్లో వ్యాపారం చేస్తోంది.

More Telugu News