Nara Lokesh: నారా లోకేశ్ తో చర్చించిన పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్యే సహా మరో ఇద్దరిపై కేసు నమోదు!

  • రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సుబ్బయ్య హత్య
  • ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేంత వరకు ప్రొద్దుటూరులోనే ధర్నా చేస్తానని హెచ్చరించిన లోకేశ్
  • సుబ్బయ్య భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు
After discussion with Nara Lokesh police registered case against YSRCP Proddutur MLA

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్య చేయించింది వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని సుబ్బయ్య భార్య అపరాజిత ఆందోళన చేపట్టారు. టీడీపీ నేత నారా లోకేశ్ కూడా ప్రొద్దుటూరుకు వెళ్లి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతేకాదు, ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధలను కేసులో చేర్చాలని అపరాజితతో పాటు డిమాండ్ చేశారు. వీరి పేర్లను చేర్చేంత వరకు ప్రొద్దుటూరులోనే ధర్నా చేస్తానని లోకేశ్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

ఈ నేపథ్యంలో, నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు నారా లోకేశ్ తో చర్చలు జరిపారు. అనంతరం అపరాజిత వాంగ్మూలాన్ని నమోదు చేశారు. హత్య కేసులో ప్రసాద్ రెడ్డి, బంగారురెడ్డి, రాధల పేర్లను చేర్చారు. సెక్షన్ 161 ప్రకారం నమోదు చేసిన అపరాజిత వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. 15 రోజులలో విచారణ వేగవంతం చేసి, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని లోకేశ్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.

More Telugu News