West Bengal: టీఎంసీ నేతను తుపాకితో కాల్చి చంపిన దుండగులు

  • మిత్రుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఘటన
  • పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు
  • హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు
TMC leader shot dead in Howrah

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన నేతను దుండగులు తుపాకితో కాల్చి చంపారు. హౌరా జిల్లాలోని షాలిమార్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. టీఎంసీ యువజన విభాగం నేత ధర్మేంద్ర సింగ్ (40) మరో మిత్రుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, మరో బైక్‌పై వచ్చిన దుండగులు ధర్మేంద్రపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు.

తీవ్రంగా గాయపడిన ధర్మేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ధర్మేంద్ర మిత్రుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హత్య వెనక వ్యక్తిగత కక్షలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మేంద్ర గతంలో నిర్మాణ రంగంలో ఉండేవారు. అప్పట్లో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. కాగా, ధర్మేంద్ర హత్యతో హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు వాహనాలను తగలబెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు.

More Telugu News