Yadagirigutta: జనవరిలోనే తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభం!

  • బ్రహ్మోత్సవాల లోగానే ఆలయం ప్రారంభం
  • జనవరి నెలాఖరులో మంచి ముహూర్తాలు
  • కల్యాణకట్ట, గుండంల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు
Yadagirigutta Re Opening on January

యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేలోగానే ఆలయాన్ని ప్రారంభించి, ప్రధానాలయంలో లక్ష్మీ నారసింహుని దర్శనాలను భక్తులకు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా, సాధ్యమైనంత త్వరలోనే ఆలయ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లూ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం స్వామివారి దర్శనాన్ని కొండ దిగువను ఉన్న బాలాలయంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జనవరి నెలాఖరులో మంచి ముహూర్తాలు ఉండటంతో మూల విరాట్ దర్శనాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గుట్టపైన ప్రధాన దేవాలయంతో పాటు పనులన్నీ పూర్తికాగా, కొండ దిగువన అభివృద్ధి పనులు మాత్రం జరుగుతున్నాయి. కల్యాణకట్ట, గుండం, ప్రెసిడెన్షియల్ సూట్లతో పాటు రింగురోడ్డు పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా రింగురోడ్డు పనులకు అడ్డుగా ఉన్న కొన్ని ఇళ్లను తొలగించాల్సి వుంది. ప్రజలకు పునరావాసం కల్పించిన తరువాతే ఇళ్లను తొలగించాల్సి వుంది. ఇక దిగువన నిర్మిస్తున్న కల్యాణకట్టతో పాటు, పుష్కరిణి పనులు జనవరిలో పూర్తయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆలయ ప్రారంభానికి ముహూర్తాలు కూడా ఇప్పటికే ఖరారు కాగా, వాటిల్లో ఒకదాన్ని కేసీఆర్ ఖరారు చేయనున్నారు. సీఎం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ప్రారంభోత్సవాన్ని వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.

More Telugu News