Savitha Sharma: ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. ఆశపడి మోసపోయిన మహిళ!

  • బెంగళూరులో ఘటన
  • ఫేస్ బుక్ ఫుడ్ ఆర్డర్ ప్రకటన చూసిన మహిళ
  • లింక్ పంపిన ఆగంతుకుడు
  • డెబిట్ కార్డు వివరాలు పంచుకున్న మహిళ
  • ఖాతా నుంచి రూ.49,996 మాయం
Woman lost her money after order food in Online

ఒకటి కంటే ఒకటి ఫ్రీ అనే ఆఫర్లు అందరికీ తెలిసిందే. తమ వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆన్ లైన్ లో ఇలాంటి ప్రకటనను చూసి మోసపోయింది. సవిత శర్మ (58) అనే మహిళ ఫేస్ బుక్ లో ఓ ఆహార సంబంధ ప్రకటన చూశారు. ఒక ఫుడ్ ఆర్డర్ కు మరో ఫుడ్ ఆర్డర్ ఫ్రీ అని అందులో ఊరించారు.

దాంతో సవిత శర్మ ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేసి రూ.250 విలువ చేసే రెండు ఫుడ్ ఆర్డర్లు బుక్ చేశారు. ఫోన్ లో ఆమెతో మాట్లాడిన వ్యక్తి మొదట రూ.10 చెల్లిస్తే చాలని, ఆర్డర్లు డెలివరీ ఇచ్చినప్పుడు మిగతా సొమ్ము చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలికాడు. అది నిజమేనని నమ్మిన సవితా శర్మ ఆ వ్యక్తి తన ఫోన్ కు పంపిన ఓ లింకును ఓపెన్ చేసి అందులో తన డెబిడ్ కార్టు డీటెయిల్స్ పంచుకున్నారు. ఆఖరికి పిన్ నెంబర్ కూడా ఇచ్చేశారు.

ఇంకేముంది.... కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆమె ఖాతా నుంచి రూ.49,996 మాయం అయ్యాయి. నగదు విత్ డ్రా చేసినట్టు తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసుకుని సవితా శర్మ ఆందోళనకు గురయ్యారు.   ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దాంతో ఆమెకు తాను మోసపోయానని అర్థమైంది. దాంతో ఆలస్యం చేయకుండా బెంగళూరు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.

More Telugu News