Virat Kohli: ఏం చెప్పాలో తెలియడంలేదు: ఆసీస్ చేతిలో భంగపాటుపై కోహ్లీ స్పందన

  • అడిలైడ్ టెస్టులో టీమిండియా ఓటమి
  • రెండున్నర రోజుల్లో ముగిసిన తొలి టెస్టు
  • మాటలు రావడంలేదన్న కోహ్లీ
  • తమలో తీవ్రత లోపించిందని వెల్లడి
  • టీమిండియా కుర్రాళ్లు తప్పక పుంజుకుంటారని ధీమా
Kohli in no words situation after disastrous loss in Adelaide test

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ మ్యాచ్ ఫలితంపై నా మనసులో మెదులుతున్న భావాలను వెల్లడించడానికి మాటలు రావడంలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. 60 పరుగుల ఆధిక్యంలో ఉండి కూడా రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిపోయామని వెల్లడించాడు.

రెండు రోజులు ఎంతో శ్రమించి తిరుగులేని పొజిషన్ లో ఉన్న తాము, కేవలం ఒక గంటలో ఇక గెలవలేని పరిస్థితికి జారిపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. ఇవాళ ఆటలో తాము మరింత తీవ్రత చూపించి ఉంటే బాగుండేదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ బౌలర్లు మొదటి ఇన్నింగ్స్ తరహాలోనే బౌలింగ్ చేసినా, పరుగులు తీయాలన్న ఆలోచనా సరళితో తాము బ్యాటింగ్ చేసి, వికెట్లు అప్పగించామని వివరించాడు.

అయితే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కుర్రాళ్లు గట్టిగా పుంజుకుంటారని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపాడు. కాగా, విరాట్ కోహ్లీ మొదటి టెస్టు అనంతరం భారత్ తిరిగిరానున్న సంగతి తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవించనుండడంతో ఆమె పక్కన ఉండాలన్న ఉద్దేశంతో కోహ్లీ సిరీస్ లో మిగిలిన 3 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడంలేదు.

More Telugu News