Andhra Pradesh: సరైన డీపీఆర్‌ను పంపండి.. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీకి కేంద్ర జల సంఘం ఆదేశం

  • రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ సరిగ్గాలేదు
  • అందులో  కనీస ప్రాథమిక అంశాలు లేవు
  • దాన్ని‌ ఎలా తయారు చేయాలన్న విషయంపై మార్గదర్శకాలు ఉన్నాయి
  • వాటిని పాటిస్తూ రూపొందించి మళ్లీ పంపండి  

రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ విషయంలో కేంద్ర జలసంఘం ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. అందులో  కనీస ప్రాథమిక అంశాలు లేవని, దాన్ని‌ ఎలా తయారు చేయాలన్న విషయంపై మార్గదర్శకాలను పాటిస్తూ, సరైన డీపీఆర్‌ తయారు చేసి పంపాలని
ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ ముఖర్జీ లేఖ రాశారు.

అలాగే, ఈ లేఖ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు నిన్న ఈ లేఖలు అందాయి.  రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు చేపట్టిన విషయం తెలిసిందే.  సంగమేశ్వరం నుంచి 17.9 కి.మీ దూరం వరకు దీన్ని చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో అప్రోచ్‌కాలువ తవ్వి పంపుహౌస్‌ నిర్మించి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి పంపేలా ఇది ఉంది. గతంలో దీని డీపీఆర్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర జలసంఘానికి ఏపీ సర్కారు పంపింది.  

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను అందులో వివరించింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో పాటు నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తీసుకోలేం కాబట్టి దీన్ని చేపట్టినట్లు పేర్కొంది. అయితే, సర్కారు సమర్పించిన డీపీఆర్‌లో పలు అంశాలను తెలపలేదు. వాటిలో ప్రధాని నీటి లభ్యత, అంతర్‌ రాష్ట్ర విషయాలతో పాటు పెట్టుబడి, ప్రయోజనాలు లాంటి అంశాలు లేకపోవడంతో జల సంఘం అభ్యంతరాలు తెలుపుతోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీకి పలు సూచనలు చేసింది. ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఈ డీపీఆర్ లో పొందుపర్చిన అంశాలు సరిపోవని పేర్కొంది. జలసంఘం వెబ్‌సైట్‌లో ఉన్న మార్గదర్శకాల మేరకు అన్ని అంశాలను స్పష్టంగా తెలుపుతూ డీపీఆర్ ను మళ్లీ పంపాలని సూచించింది. 

  • Loading...

More Telugu News