అలీగఢ్ ముస్లిం వర్శిటీ శతజయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ!

PM to Address Aligarh Muslim University and Vice Chancellor Urges No Politics
  • డిసెంబర్ 22న శతవార్షిక వేడుకలు
  • ముఖ్య అతిథిగా పాల్గొననున్న మోదీ, పోక్రియాల్
  • బీజేపీ నేతలతో సత్సంబంధాలు లేని వర్శిటీ
ప్రతిష్ఠాత్మక అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీని ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 22న ప్రత్యేక ఉత్సవాలు జరుగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. వర్చ్యువల్ గా సాగే ఈ సమావేశానికి మోదీతో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ కూడా హాజరు కానున్నారు.

 ఈ నేపథ్యంలో వర్శిటీ వైస్ చాన్స్ లర్ తారిఖ్ మన్సూర్, ఓ మీడియా ప్రకటనను విడుదల చేస్తూ, "వేడుకల్లో పాల్గొనడానికి అంగీకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వర్శిటీ సిబ్బంది, విద్యార్థులు ఈ వేడుకల్లో చురుకుగా పాల్గొనాలి. అలాగే, ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచి, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.

కాగా, అలీగఢ్ యూనివర్శిటీకి, బీజేపీ నేతలకు మధ్య సత్సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు పదేపదే వర్శిటీ విద్యార్థులను విమర్శిస్తుండటం, తరచూ వర్శిటీ పేరును మార్చాలని డిమాండ్ చేస్తుండటం అందరికీ తెలిసిందే. పౌర సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకుని వచ్చిన వేళ, వర్శిటీ వేదికగా ఎంతో ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో అలీగఢ్ వర్శిటీతో పాటు ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు సైతం ఉద్యమించి కేసులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్శిటీ శత వార్షిక వేడుకల వేళ, వైస్ చాన్స్ లర్ ఇటువంటి ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Go Back to Shorts
Alighad Muslim Vercity
Centenary Celebrations
Narendra Modi

More Telugu News